‘హోదా’కోసం వినూత్న నిరసన
Published Tuesday, 2 August 2016విశాఖపట్నం, ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి వినూత్న రీతిలో నిరసన తెలపాలన్న టిడిపి అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు బాగానే స్పందించారు. ఆ పార్టీ ఎమ్మేల్యే ఏకంగా పీఠాధిపతిగా అవతారమెత్తారు. అంతటితో ఆగకుండా బిజెపి తరపున ఏపీ అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. విశాఖ నగరంలో సోమవారం జరిగిన ఈ వినూత్న నిరసనకు అధికార పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పీఠాధిపతి వేషం వేయగా, మిత్రపక్ష ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వినతిపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తమతో కలిసి పోటీచేసిన సందర్భంలో బిజెపి ఏపీకి ప్రత్యేక హోదాపై హామీలిచ్చిందన్నారు. సాక్షాత్తు నరేంద్ర మోదీ తిరుపతి సభలో హోదా ఇచ్చేది తామేనంటూ ప్రకటించిన అంశాన్ని గుర్తుచేశారు. టిడిపి ఎమ్మెల్యే నిరసనపై స్పందించిన బిజెపి పక్షనేత విష్ణుకుమార్ రాజు ప్రత్యేక హోదాపై తమ పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ఎపికి హోదా కంటే ఎక్కువే మేలు చేకూర్చామని వివరణనిచ్చారు. ఏ విధంగానూ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు.
చిత్రం.. ఏపీ ప్రత్యేక హోదా ఇప్పించాలని కోరుతూ పీఠాధిపతి వేషధారణలో బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజుకు వినతిపత్రం అందజేస్తున్న టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్