రూ.4.5 కోట్ల ఎపిడ్రిన్ పట్టివేత
Published Tuesday, 2 August 2016కడప, ఆగస్టు 1: కడపలో ఎపిడ్రిన్ ముఠాను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్సీ(డిఆర్ఐ) అధికారులు అరెస్టుచేసినట్ల సమాచారం. ఈ ముఠానుంచి రూ.4.5 కోట్ల విలువచేసే ఎపిడ్రిన్(మత్తు పదార్థం) స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిఘాశాఖ ఆధికారులు ఆదివారం రాత్రి కడపకు చేరుకుని ఎపిడ్రిన్ విక్రయించే ముఠాకు చెందిన ముఖ్యనిందితుడిని అదుపులోకి తీసుకుని రాత్రికి రాత్రి అత్యంత గోప్యంగా హైదరాబాద్కు తీసుకెళ్లినట్లు సమాచారం. నిందితుడి నుంచి 45 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్ ఆటోనగర్లో డ్రగ్స్ను గోప్యంగా తయారుచేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్ర నిఘాశాఖ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వారు కడపకు చేరుకుని ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.