పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
Published Tuesday, 2 August 2016బుక్కరాయసముద్రం, ఆగస్టు 1: ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన ఓ తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారకర సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పంచాయితీ పరిధి కొట్టాలపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన భారతి(25) తన ఇద్దరు పిల్లలు మహాలక్ష్మి(6), కుమారుడు(6 నెలలు)కు విషమిచ్చి అనంతరం తానూ ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆనంద్రెడ్డికి నెల్లూరు జిల్లాకు చెందిన భారతితో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆటో నడిపి జీవనం సాగిస్తున్న ఆనంద్రెడ్డి అప్పులపాలయ్యాడు. అవి తీర్చేదారిలేక మద్యానికి బానిసగా మారాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన భారతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి మద్యం తాగి నిద్రించగా తొలుత ఇద్దరు పిల్లలతో విషం తాగించిన భారతి అనంతరం ఉరేసుకుంది. ఉదయం ఇరుకుపొరుగు వారు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, భర్త అప్పుల బాధ చూడలేక పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు భారతి సూసైడ్ నోట్లో రాసింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.