ఎయు అధికారులపై ప్రిన్సిపల్ సెక్రటరీ అసంతృప్తి
Published Tuesday, 2 August 2016విశాఖపట్నం, ఆగస్టు 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్ నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వెబ్సైట్లను నిర్వహించడమే కాకుండా అప్డేట్ చేయకపోవడంపై అధికారులను ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఎయు ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. అయితే తరువాతి కాలంలో పరీక్ష సమాచారం కోసం మరొక వెబ్సైట్ను రూపొందించారు. ఇది కాక ఎయు ఇంజనీరింగ్ కళాశాల మరో వెబ్సైట్ను నిర్వహిస్తున్నది. దీంతో ఎయుకు మూడు వెబ్సైట్లు ఉన్నాయి. విద్యార్థులు సమాచారం కోసం మూడు వెబ్సైట్లను చూడాల్సి వస్తోంది. ఇంజనీరింగ్ కళాశాల వెబ్సైట్ను పక్కన పెడితే ఎయు రెండు వెబ్సైట్లను కలిగి ఉంది. దీనికి తోడు అధికారిక వెబ్సైట్లోని వివరాలను అప్డేట్ చేయడం లేదు. వివరాలను అప్డేట్ చేసేందుకు ఆయా విభాగాలు, అధ్యాపకుల నుంచి కంప్యూటర్ సెంటర్కు సమాచారం తెలియచేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సక్రమంగా పంపకపోవడంతో వెబ్సైట్లోని వివరాలు ఎప్పటివో ఉంటున్నాయి. దీంతో ఎయు తీరుపై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. త్వరలోనే వివరాలను అప్లోడ్ చేసి వెబ్సైట్ను అప్డేట్ను చేస్తామని అధికారులు ప్రకటించారు. తాజాగా ఎయు వెబ్సైట్ హ్యాక్ కావడంతో మరోసారి వెబ్సైట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎయు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో వెబ్సైట్ నిర్వహణ కూడా ఒక అంశంగా చేర్చారు. వెబ్సైట్లో ఎప్పటి వివరాలో ఉన్నాయని, అప్డేట్ చేయాలని ఆదేశించారు. తరచూ వివరాలను అప్డేట్ చేయాలన్నారు. రెండు వెబ్సైట్లను కలిపి ఒకటిగా రూపొందించాల్సి ఉంది. ఏ సంస్థకైనా అధికారికంగా ఒక వెబ్సైట్ ఉంటుంది. దీనికి తోడు వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి సిబ్బంది మధ్య ఉన్న విభేదాలు ఎయుపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎయు అధికారులు స్పందించి ఒకటి మాత్రమే ఉండేలా చూడాల్సి ఉంది.