ఇన్ఛార్జ్ డిపిఆర్ఓగా మోహనరావు బాధ్యతల స్వీకరణ
Published Tuesday, 2 August 2016మచిలీపట్నం, ఆగస్టు 1: జిల్లా ఇన్ఛార్జ్ డిపిఆర్ఓగా విజయవాడ డివిజనల్ పిఆర్ఓ ఎస్వి మోహనరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిపిఆర్ఓగా కొనసాగిన జి గోవిందరాజులు పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో మోహనరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయన గోవిందరాజులును పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిపిఆర్ఓ మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పత్రికా రంగం ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎపిఆర్ఓలు ఎస్ శ్రీనివాసరావు, అలీ, సీనియర్ అసిస్టెంట్ పివివి సత్యనారాయణ, టైపిస్టు కందుల వెంకటేశ్వరరావు, పబ్లిసిటీ అసిస్టెంట్లు జెవి నరసింహరావు, బి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
1ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి
* ఎమ్మెల్యే రాజగోపాల్
జగ్గయ్యపేట, ఆగస్టు 1: భవిష్యత్తు తరాలకు పర్యావరణ సమతుల్యాన్ని, ఆహ్లాద, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం తప్పనిసరి అని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. హరితాంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ’వనం-మనం’ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో యార్డు కార్యదర్శి భాస్కరరావు, కౌన్సిల్ సభ్యులు కటికల అనీల్, చారుగుండ్ల కొండ, మైనేని రాధా తదితరులు పాల్గొన్నారు.
పేట సాగునీటి పథకం వివరాలను కోరిన సిఎం
పట్టణ వాసుల చిరకాల వాంఛ అయిన కృష్ణా జలాలను మంచినీరుగా అందించే పథకం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగారని ఎమ్మెల్యే రాజగోపాల్ తెలిపారు. కృష్ణాజలాల మంచినీటి అంశంలో సిఎం సానుకూలంగా స్పందించారన్నారు. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని డియంఎను ఆదేశించారన్నారు.
శాకంబరిదేవిగా అమ్మవార్లు
మోపిదేవి, ఆగస్టు 1: పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయంలో శాకంబరి అలంకరణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదా కుమారి పర్యవేక్షణలో దుర్గాదేవి, పార్వతీ దేవిని శాకంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు. ప్రధాన అర్చకులు బద్దు కుమార స్వామి, అర్చకులు నాగ వర ప్రసాద్, శంకరమంచి విజయ కుమార్, బద్దు నారాయణ స్వామి పూజాదికాల్లో పాల్గొనగా ఆలయ సూపరింటెండెంట్ చెన్నకేశవరావు పర్యవేక్షించారు.