రైతులకు కంటకప్రాయుడు
Published Tuesday, 2 August 2016మహబూబ్నగర్, ఆగస్టు 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పాలిట కంటకప్రాయుడుగా తయారయ్యారని, కేవలం ఆయన కాంట్రాక్టర్లకు మాత్రం ప్రియుడయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూ బ్నగర్ జిలాల్లో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టాలని మహబూబ్నగర్లో సోమవారం నిర్వహించిన జలసాధన దీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కెసిఆర్ పరిపాలనలో రైతులు భయంతో బతుకుతున్నారని, ఆయన కుటుంబం మాత్రం సంతోషంగా ఉన్నారని ఆరోపించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చాలా తప్పులు చేస్తున్నారని, ఆ తప్పులను నాగం జనార్దన్రెడ్డి ఎత్తిచూపడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి కోట్లల్లో ఉండొచ్చని ఇది ఇప్పుడు బయటపడే ఆస్కారం లేకుండా కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని కెసిఆర్ బం డారాన్ని నాగం బయటపెట్టే ఆస్కా రం ఉందని ఆయన చమత్కరించా రు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2014లోనే 69 జిఓ వచ్చిందని ఈ జిఓ ద్వారా పథకాన్ని నిర్మించాల్సిందిపోయి పక్కకు పెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకం నుండి సాగునీరు అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నా రు. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుండి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టు ద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని దాదాపు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి అస్కారం ఉందన్నారు. అలా కాకుండా దాదాపు 200 పైగా కిలో మీటర్ల దూరంలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు ఇస్తామని చెప్పడం అందులో ఏమీ మర్మం ఉందో అర్థం కావడం లేదన్నారు.
చిత్రం.. మహబూబ్నగర్లో నిర్వహించిన జలసాధన మహాధర్నాలో ప్రసంగిస్తున్న మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి