హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
Published Wednesday, 3 August 2016కంఠేశ్వర్, ఆగస్టు 2: నిజామాబాద్ మండలం సిర్పూర్లో గత వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఆనంద్కుమార్ వివరాలు వెల్లడించారు. గత నెల 24వ తేదీన సిర్పూర్లో మాదాపురం శ్యామ్(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని, ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్, యూసుఫ్ఖాన్లను అరెస్టు చేశామని అన్నారు. మేస్ర్తిగా కొనసాగుతున్న శ్యామ్ వద్ద అహ్మద్, యూసుఫ్ఖాన్లు పని చేసేవారని, డబ్బులు చెల్లించే విషయంలో విభేదాలు తలెత్తడంతో శ్యామ్ వారిని పని నుండి తొలగిస్తూ ఇతరులను నియమించుకున్నాడని తెలిపారు. అప్పటి నుండి శ్యామ్ మీద కక్ష పెంచుకున్న యూసుఫ్, అహ్మద్లు అతనిని హత్య చేయాలని పథకం రూపొందించుకున్నారని అన్నారు. గత నెల 24వ తేదీన మద్యం సేవించిన అనంతరం శ్యామ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారని, బయటకు వచ్చిన శ్యామ్తో గొడవపడిన అనంతరం తమ వెంట తీసుకెళ్ని ఇనుప రాడ్డు, గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారని తెలిపారు. అప్పటి నుండి నిందితులు పరారీలో ఉండగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న రూరల్ పోలీసులు మంగళవారం పక్కా సమాచారం అందడంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. డిచ్పల్లిలోని గొల్లపల్లి గ్రామంలో అహ్మద్ తన అక్క ఇంట్లో యూసుఫ్తో కలిసి ఉండగా, రూరల్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు నేతృత్వంలో సిబ్బంది అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారని అన్నారు. శ్యామ్ను తామే హత్య చేసినట్టు నిందితులు విచారణలో అంగీకరించారని డిఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులు ఇరువురిని కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. విలేఖరుల సమావేశంలో రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.