ఇదేనా ‘స్మార్ట్ సిటీ’!
Published Wednesday, 3 August 2016వరంగల్, ఆగస్టు 2: వరంగల్ నగరం మున్సిపల్ కార్పొరేషన్ నుండి గ్రేటర్ వరంగల్కు నోచుకొని స్మార్ట్సిటీగా ఎదిగినా పట్టణ రూపురేఖలు మారడం లేదు. గ్రేటర్ పరిధిలోని అనేక కాలనీలు మురికి కాలువల మధ్య మగ్గుతున్నాయి. తేలికపాటి వర్షం కురిసినా లోతట్టు ప్రాంతాలు జలమయమై కాలనీల మధ్య ఉండే మురికి కాలువలతో కలిసి వర్షపు నీరు పొంగిపొర్లుతూ ఇళ్లలోకి చేరుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని నాగేంద్రనగర్, పవన్నగర్, శాకరాసికుంట, లక్ష్మీనగర్, దీన్దయాళ్నగర్తో పాటు పేదలు నివసించే అనేక కాలనీలు మురికి కాలువల మధ్య మగ్గుతున్నాయి. ఏళ్ల తరబడి పరిస్థితి ఇలాగేకొనసాగుతున్నప్పటికి ఎన్నికల ముందు తప్ప ఈ కాలనీలను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు. పట్టణ పేదలు మురికికాలువల మధ్యే సావాసం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగేంద్రనగర్లో ఆ కాలనీ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇండ్ల మధ్యే మురికికాలువలు పొంగిపొర్లుతుండడంతో ఆ కాలనీల ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. వరంగల్ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి అనేక పథకాలు కేటాయిస్తున్నప్పటికి ఇంతవరకు ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే తమను వాడుకుంటూ మళ్లీ ఎన్నికల వరకు కూడా తమ కాలనీలను పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలపై, వౌళిక వసతులపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.