మైనారిటీ గురుకులంలో ఎసిబి తనిఖీ
Published Wednesday, 3 August 2016హుజూరాబాద్, ఆగస్టు 2: హుజూరాబాద్ పట్టణంలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన మైనారిటీ గురుకుల పాఠశాలను మంగళవారం ఎసిబి డి ఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం కూడా రుచి చూశారు. రికార్డులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల, కోరుట్లతో పాటు హుజూరాబాద్లోని మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశామని వెల్లడించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సదాశివ్ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ సుదర్శన్గౌడ్ విలేఖర్లతో మాట్లాడుతూ స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాలలో వసతులు, భోజనం బాగున్నాయని ప్రశంసించారు. అయితే కొన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు విద్యార్థులు తమకు ఫోన్ చేసి చెప్తున్నారని, త్వరలోనే అన్ని హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తామని వెల్లడించారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు వెల్లడైతే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.