అమెరికాలో తొలిసారి టీమిండియా మ్యాచ్లు
Published Wednesday, 3 August 2016ముంబయి, ఆగస్టు 2: భారత క్రికెట్ జట్టు మొట్టమొదటిసారి అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడనుంది. ఫ్లోరిడాలో ఆ జట్టు వెస్టిండీస్తో రెండు టి-20 మ్యాచ్ల సిరీస్ను ఆడబోతోంది. ఇంతకు ముందు వెస్టిండీస్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరిగిన ప్లోరిడాలోని ఫోర్ట్ లూడెర్డేల్లో ఉన్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్కు వేదికగా ఆగస్టు 27, 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్లు జరుగుతాయి. భారత్లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. పెద్ద సంఖ్యలో భారతీయులు ఉండే అమెరికా మార్కెట్కు చేరువ కావడానికి బిసిసిఐ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. ధోనీ, కోహ్లీలాంటి ఆటగాళ్లు ఒక వైపు, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావోలాంటి దిగ్గజాలు మరోవైపు ఉండడంతో అమెరికాలోని అభిమానులకు ఈ మ్యాచ్లు కనువిందు చేస్తాయనే భావిస్తున్నారు. ‘కొత్త మార్కెట్లు, ప్రేక్షకులకు చేరువ కావాలనే మా నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుత ప్రపంచ టి-20 చాంపియన్స్ అయిన వెస్టిండీస్తో టీమిండియా అమెరికాలో రెండు టి-20 మ్యాచ్లు ఆడబోతున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాను’ అని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకుర్ చెప్పారు.