రహానే అజేయ శతకం
Published Wednesday, 3 August 2016కింగ్స్టన్ (జమైకా), ఆగస్టు 2: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా కింగ్స్టన్లోని సబీనా పార్క్లో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే అజేయ అర్ధ శతకంతో సత్తా చాటుకున్నాడు. అమిత్ మిశ్రా (21), ఉమేష్ యాదవ్ (19) అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న రహానే 237 బంతుల్లో 108 పరుగులు సాధించి టెస్టు కెరీర్లో ఏడో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో 9 వికెట్లు నష్టానికి 500 పరుగులు రాబట్టి 304 పరుగుల ఆధిక్యత సాధించిన భారత జట్టు సోమవారం టీ విరామ సమయానికి ముందు తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత వర్షం కురవడంతో నాలుగో సెషన్ ఆట సాగలేదు. మంగళవారం నాలుగో రోజు కూడా వర్షం వలన మ్యాచ్కు చాలాసేపు అంతరాయం ఏర్పడటంతో ఆలస్యంగా రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు మరోసారి ఆరంభంలోనే తడబడింది. మూడో ఓవర్లో ఇశాంత్ శర్మ వేసిన బంతిని ఎదుర్కోబోయి రాజేంద్ర చంద్రిక (1) క్లీన్బౌల్డ్గా వెనుదిరగడంతో ఆతిథ్య జట్టుకు తొలి దెబ్బ తగిలింది. అనంతరం ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్, డారెన్ బ్రావో ఇన్నింగ్స్ను ముందుకు నడిపేందుకు ప్రయత్నిస్తుండగా మళ్లీ వర్షం కురవడంతో మధ్యాహ్న భోజన విరామ సమయానికి ముందే మరోసారి మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బ్రాత్వైట్ 4 పరుగులతోనూ, బ్రావో 1 పరుగుతోనూ అజేయంగా నిలిచారు. దీంతో ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు టీమిండియా కంటే ఇంకా 298 పరుగులు వెనుకబడి ఉంది.
chitram...
అజింక్యా రహానే (108-నాటౌట్)
పదే పదే వర్షం కురుస్తుండటంతో పిచ్పై పరదాలు కప్పుతున్న దృశ్యం