అంతా.. ఐదు క్షణాల్లో..!
Published Wednesday, 3 August 2016సికింద్రాబాద్, ఆగస్టు 2: విధులు ముగించుకుని షాపును మూసివేయడానికి తాళాలు సైతం తీసుకుని వారు సిద్థమయ్యారు. ఐదంటే ఐదే నిముషాల్లో బయటికి వెళ్లేవారే .. ఇంతలో ఒక్కసారిగా భవంతి కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ చిలకలగూడలో సోమవారం రాత్రి పురాతన భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన క న్నీటి కథ స్థానికులను కలిచివేసింది. చిలకలగూడ పాత పోలీస్స్టేషన్ ప్రాంతంలో ఉన్న రెండతస్తుల పురాతన భవంతి శిథిలావస్థకు చేరుకుంది. ఆజీబాబాకు చెందిన ఈ భవంతి కూలడానికి సిద్ధంగా ఉండడంతో గత సంవత్సరం జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేతకు నోటీసులు జారీ చేశారు. ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జిహెచ్ఎంసి అధికారులు ఇచ్చిన నోటీస్పై సదరు యజమాని కోర్టుకు కూడ వెళ్లినట్లు సమాచారం. వారం రోజుల క్రితం మరోసారి జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. పురాతన భవంతిలో ఉన్న రెండు షాపుల్లో ఒకదాంట్లో చికెట్ సెంటర్ ఉండగా మరోషాపులో జిరాక్స్ షాపును నిర్వహిస్తున్నారు. జిరాక్స్ షాపులో దాదాపు నలుగురు వ్యక్తులు పని చేస్తుంటారు. భవంతి కూలడానికి పది నిముషాల క్రితమే జిరాక్స్ షాపును మూసివేసి ఇంటికి వెళ్లారు. చికిన్ షాపును నిర్వహిస్తున్న చిలకలగూడ కిందిబస్తీకి చెందిన అక్బర్ (38), వాజిద్ (32) విధులు ముగించుకుని షాపును మూసివేయడానికి సిద్థమయ్యారు. ఇంతలో ఒక్కసారిగా భవంతి కూలిపోవడంతో శిథిలాల్లో ఇరువురు చిక్కుకుపోయారు. పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది, స్థానికులు శిథిలాలను తొలగించి కొన ఊపిరితో ఉన్న ఇరువురిని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. చికెన్షాప్ యజమాని అక్బర్తోపాటు వాజిద్ తుదిశ్వాస విడిచారు. అక్బర్కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వాజిద్కు ఇంకా వివాహం కాలేదు. కేసును నమోదు చేసుకుని చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అందుకే ప్రమాదాలు..
శిథిలావస్థకు చేరుకున్న భవంతులు సికింద్రాబాద్లో చాలా వరకు ఉన్నప్పటి ఇంటి యజమానులు ఖాళీ చేయడానికి ససేమిరా అంటుండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జిహెచ్ఎంసి హెచ్చరికటు స్పందించి ప్రమాదాల నివారణకు తోడ్పాటు అందించాలని అధికారులు కోరుతున్నారు. కాగా, సంఘటన జరిగిన నిముషాల వ్యవధిలోనే మంత్రి పద్మారావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. దాదాపు తెల్లవారు పూర్తిగా శిథిలాలను తొలగించేంత వరకు అక్కడే ఉన్నారు.