ఇంకా ఏం చేయాలి
Published Wednesday, 3 August 2016ఏలూరు, ఆగస్టు 2 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన నేపధ్యంలో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కూడా పార్టీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారని, ఇప్పటి వరకు ప్రభుత్వంచేసిన పనులు ప్రజల్లో స్పందన ఎలా వుంది, ఇంకేమీ చేస్తే బాగుంటుందనే విషయంపై నియోజకవర్గాల వారీగా మంగళవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమీక్షా సమావేశాలను నిర్వహించారు. నర్సాపురం, ఆచంట, పోలవరం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు నియోజకవర్గాలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయిలో నివేదికలు వారీగా చర్చించారు. ఆచంట నియోజకవర్గంలో కొంత మేరకు అసంతృప్తి వున్నట్లు నేతలు అధినేత ఎదుటే విమర్శించారు. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి సంతృప్తికరంగానే వున్నట్లు నిర్ధారించారు. ఆయన వెంట తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్టీ జిల్లా పరిశీలకులు ఎండి నజీర్, మంత్రి పీతల సుజాత, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పాలి ప్రసాద్ పాల్గొన్నారు.