బిజెపి ఆంధ్రాకు న్యాయమే చేస్తోంది
Published Wednesday, 3 August 2016భీమవరం, ఆగస్టు 2: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్కు న్యాయమే చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ చెప్పారు. హోదా పేరుతో రాజకీయ పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. మంగళవారం ఆయన భీమవరంలో విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఐదేళ్లు మాత్రమే హోదా ఇస్తామని చెబితే, దానికి కొనసాగింపుగా లోక్సభలో ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ మద్దతు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దమ్ముంటే లేఖలు ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు. ఆనాడు రాష్టవ్రిభజన జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలని అడిగింది ఒక్క భారతీయ జనతాపార్టీ, ఆ తరువాత లోక్సత్తా పార్టీయేనని పాకా సత్యనారాయణ గుర్తుచేశారు. బిజెపి ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు స్పష్టత లేక ఏం చేస్తున్నాయో వాటికే తెలియడం లేదన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను ఆంధ్రప్రదేశ్లోని సిఎం చంద్రబాబునాయుడు తమ సొంత పథకాలుగా మార్చుకుని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసిపిలు తమను తాము బతికించుకోవడం కోసం ప్రత్యేక హోదా పేరుతో బంద్లు, ఆందోళనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు.