ఆర్టీసీపై బంద్ ప్రభావం నిల్
Published Wednesday, 3 August 2016విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని మంగళవారం జరిగిన బంద్లో భాగంగా వామపక్షాల పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డగించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. బంద్ కారణంగా ఉదయం నాలుగు నుంచి పది గంటల వరకు డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. అదేవిధంగా సాలూరు, పార్వతీపురం డిపోలలో కూడా కొన్ని గంటల సేపు బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఆర్టీసీపై బంద్ ప్రభావం ఏమాత్రం లేకపోయినప్పటికీ బస్సుల రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల విజయనగరం జిల్లాలో ఐదు లక్షల రూపాయల మేరకు ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది. విజయనగరం డిపో అత్యధికంగా 25 బస్సులు నిలిచిపోయాయి. ముఖ్యంగా దూర ప్రాంత సర్వీసులు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురయ్యారు. రీజనల్ మేనేజర్ కార్యాలయంలో బంద్ ప్రభావంపై ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్మేనేజర్ ఎన్విఆర్ ప్రసాద్ సమీక్షించారు. బస్సుల రాకపోకలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆయా డిపోలవద్ద వామపక్షాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో బస్సులు యథావిధిగా తిరిగాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి రెడ్డి శంకరరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కార్యాలయం నుంచి ఉద్యోగులు బయటకు వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో శంకరరావును టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.