నేడు ప్రివిలేజెస్ కమిటీ పర్యటన
Published Wednesday, 3 August 2016విజయనగరం, ఆగస్టు 2: రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజస్ కమిటీ బుధవారం విజయనగరం పర్యటనకు వస్తుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఎమ్మెల్యే జి.సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ బుధవారం ఉదయం 11గంటలకు విజయనగరం చేరుకుంటుందని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమై వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో పాటిస్తున్న ప్రొటోకాల్ అంశాలపై చర్చిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులు ఎన్. బాలకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, కె.రామకృష్ణ, జనార్థనరెడ్డి, రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ సమావేశంలో పాల్గొంటారన్నారు. కమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర సచివాలయం డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సెక్షన్ అధికారి సుబ్రహ్మణ్యం పాల్గొంటారని చెప్పారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో కమిటీ సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.