రాములవారి విగ్రహాలు చోరీ
Published Wednesday, 3 August 2016రేణిగుంట, ఆగస్టు 2 : మండలంలోని గుత్తివారిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో శ్రీరాముల వారి పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన సంఘటన మంగళవారం ఉదయం మండలంలో సంచలనం రేపింది. దేవాదాయ శాఖ కార్యదర్శి రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు, మండలంలోని గుత్తివారి పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయస్వామి గుడిలో సోమవారం అర్ధరాత్రి ఆలయం లోపల చొరబడిన దుండగులు నాలుగు గేట్ల తాళాలను పగులగొట్టారు. గర్భగుడిలో ఉన్న రాముడు, సీత, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలు చోరీ జరిగినట్లు తెలిపారు. ఆలయ అర్చకుడు శ్రీ్ధర్ మంగళవారం ఉదయం గుడి తెరిచేందుకు వెళ్లగా ఆలయంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారన్నారు. దీంతో ఆయన రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆలయంలో వెండి ఆభరణాలతో పాటు నగదు ఉన్నా దుండగులు కేవలం పంచలోహ విగ్రహాలే చోరీ చేశారు. ఇది విగ్రహాల చోరీకి పాల్పడే ముఠా చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు రావడంతో తిరుపతి నుంచి ఫింగర్ప్రింట్ నిపుణులు ఆలయంలో ఆధారాలు సేకరించారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా పంచలోహ విగ్రహాలు చోరీలు చేసే ముఠా సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.