రాజకీయ లబ్ధికోసమే జగన్ ఆరాటం
Published Wednesday, 3 August 2016గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 2: ఆగస్టు 2న విద్రోహ దినంగా పాటిస్తామని తల్లి, పిల్ల కాంగ్రెస్లు చెప్పడం వాటి దిగజారుడు తనానికి నిదర్శమని, రాష్ట్ర విభజన బిల్లును తప్పుల తడకగా తయారు చేసిన మీరు ద్రోహులంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఎపి భవన్లో చంద్రబాబునాయుడు ఆమరణ దీక్ష చేసినప్పుడు జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటిని ముట్టడించిన సమయంలోనూ తల్లి, పిల్ల కాంగ్రెస్లు నోరు మెదపలేదన్నారు. 11 కేసుల్లో ఎ-1 ముద్దాయిగా ఉన్న జగన్ బంద్కు పిలుపునివ్వడం వెనుక రహస్యం ఆయన కోర్టు కేసుల్లో వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకునేందుకే అని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధిపొందేందుకు వైసిపి ప్రయత్నిస్తుందని, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి లూటీ చేయడమే ధ్యేయంగా జగన్, బొత్స, కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారన్నారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన ద్రోహం చేసిన కంటే నేటి బిజెపి నాన్చుడు వ్యవహారం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఢిల్లీ కంటే గొప్ప రాజధాని నిర్మిస్తామని, హోదా ఇస్తామని మోదీ చెప్పారని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కావాల్సిన హోదాతో పాటు రాయితీలు రాబట్టేందుకు యత్నిస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం తప్ప ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెంకించగల సామర్థ్యం, అనుభవం మరెవ్వరికీ లేదన్నారు. కాంగ్రెస్, వైసిపి స్వార్ధ ప్రయోజనాలను ఇప్పటికైనా పక్కనబెట్టి తెలుగువారి ప్రయోజనాలను కాపాడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడుతో సంఘీభావంతో పనిచేయాలని సూచించారు.