పోడు సాగుదార్ల సమస్యలను శాస్ర్తియంగా పరిష్కరించాలి
Published Wednesday, 3 August 2016ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 2: పోడు సాగుదారుల సమస్యలను శాస్ర్తియంగా పరిష్కరించాలని, పోడు సమస్యలపై తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనను చేపట్టినట్లు సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి పోటు రంగారావు వెల్లడించారు. మంగళవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసి, గిరిజనులు గత కొనే్నళ్ళుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం పోడుదారులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. హరితహారం పేరుతో చేతికి వచ్చిన పంట పోలాలను పోలీసులతో కలసి అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని, అడ్డుకున్న రైతులపై తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్ళకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన నాయకులు, సానుభూతి పరులకు చెందిన పంటపోలాలను నాశనం చేస్తూ కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోడుభూముల సమస్యలు, మహిళలతో సహ ప్రజలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 8,9తేదిల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టినట్లు వెల్లడించారు. 9వ తేది ఆదివాసీ దినోత్సవం సంధర్భంగా ఆదివాసీ హక్కులపై కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో నాయకులు రాయల చంద్రశేఖర్రావు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య ఏ అశోక్కుమార్ పాల్గొన్నారు.