భూ ఎంజాయ్మెంట్ సర్వే కోసం 2,119 దరఖాస్తులు
Published Wednesday, 3 August 2016ఖమ్మం, ఆగస్టు 2: జిల్లాలో భూ ఎంజాయ్మెంట్ సర్వే కోసం 2,119దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 832దరఖాస్తులను ఆమోదించి 528 ఆన్లైన్ చేసినట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ దివ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంజాయ్మెంట్ సర్వేపై సర్వేయర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ భూ ఎంజాయ్మెంట్ సర్వే చేసేందుకు మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. సర్వే కోసం దరఖాస్తు చేసే వారు ఆ భూమిలో అనుభవదారుడిగా ఉండాలని, అందుకు సంబంధించిన ఆధార్పత్రాలను కూడా సమర్పించాలన్నారు. వ్యక్తిగతంగా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే నిర్వహించిన భూమికి ఏదైనా కారణాల వల్ల రీ సర్వే చేయాల్సి వస్తే దానిలో వ్యత్యాసం ఉంటుందని గుర్తు చేశారు. దరఖాస్తును తిరస్కరిస్తే కారణాలు దరఖాస్తుదారుడికి తెలియచేయాలని సూచించారు. కాగా సర్వేకోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసే విధానాన్ని పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.అనంతరం మండలాల వారిగా దరఖాస్తులను పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్సు సహాయ సంచాలకులు రాము, సుజాత, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.