అర్హులందరికీ పక్కా ఇళ్లు
Published Wednesday, 3 August 2016కర్నూలు సిటీ, ఆగస్టు 2:ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద అర్హులైన పేద ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సిహెచ్ విజయలక్ష్మి తెలిపారు. బిల్డర్ల సలహాలు, సూచనలు కోరుతూ మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ భవన్లో సమావేశం నిర్వహించగా పట్టణ ప్రణాళిక రీజినల్ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి, కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ జన్మభూమి రెండు విడతలతో పాటు హౌస్ ఫర్ ఆల్ పథకం కింద 26వేల దరఖాస్తులు అందాయన్నారు. అందులో మొదటి విడత కింద 10వేల గృహాలను అర్హులైన పేదలకు కట్టించి ఇస్తామని, వాటి కోసం స్థల సేకరణ కూడా చేశామన్నారు. రెండవ విడత కింద మిగిలిన 16 వేల మందికి ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. అయితే వీటి నిర్మాణాన్ని ఏ పద్ధతిలో చేపట్టాలి అనే అంశంపై ప్రభుత్వం ప్రైవేట్ బిల్డర్లను ఆహ్వానిస్తుందని, జీ+3 కింద ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5.5లక్షలు ఇస్తుందని, ఆసక్తి గల బిల్డర్లు ఏ పద్ధతిన ఇళ్లు నిర్మించి ఇస్తారో నివేదికలు ఇవ్వాలని తెలిపారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బిల్డర్లు, సిబ్బంది పాల్గొన్నారు.