నందవరంలో వైభవంగా చౌడేశ్వరీమాత జయంతి వేడుకలు
Published Wednesday, 3 August 2016బనగానపల్లె, ఆగస్టు 2:మండల పరిధిలోని నందవరంలో మంగళవారం శ్రీ చౌడేశ్వరీమాత జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి విఎల్ఎన్ రామానుజన్, కమిటీ చైర్మన్ పివి కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంకాలం వరకూ శాస్త్రోక్తంగా వివిధ కార్యక్రమాలు జరిపించారు. ఉదయం ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ గణపతిపూజతో అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, ఇతర విశేష పూజలు, శ్రీ చక్రపూజలు జరిపించారు. జయంతి పురస్కరించుకుని అమ్మవారు విశేష అలంకారంతో పాటు గజమాలలు, వివిధ రకాల పూలమాలలతో శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జయంతి కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. జిల్లాలోనే వివిధ ప్రాంతాలవారే కాకుండా అనంతపురం, కడప, గుంటూరు తదితర జిల్లాలు, బెంగళూరు నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంకాలం అమ్మవారి ఆలయ ఆవరణలో రథోత్సవం, వివిధ రకాల హారతులు, మహా నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మాధవ సిల్క్స్ వారు తీసుకువచ్చిన కేక్ను ఇందిరమ్మ భక్తులతో కలిసి కట్చేశారు. సాయంకాలం లక్షదీపార్చనతో ఆలయం శోభాయమానంగా దీపకాంతులతో వెలిగిపోయింది. ఆలయం వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. కాగా శ్రీ చౌడేశ్వరీమాత జయంతి పురస్కరించుకుని నందవరం అమ్మవారి ఆలయం పక్కనే వున్న శ్రీ రామాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సతీమణి ఇందిరమ్మ, చైర్మన్ కుమార్రెడ్డి, ఇఓ రామానుజన్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పలువురు భక్తులు రక్తదానం చేశారు.