వసతిగృహాల పనితీరుపై ఎమ్మెల్యే సమీక్ష
Published Wednesday, 3 August 2016గూడూరు, ఆగస్టు 2: గూడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రభుత్వ వసతిగృహాల పనితీరుపై ఆయా వార్డన్లతో మంగళవారం గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్కుమార్ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించి కల్పించాలన్నారు. ప్రభుత్వం వసతి గృహాలకు అవసరమైన అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తున్నదని తెలిపారు. వసతిగృహాల విద్యార్థులు బాగోగుల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా తమకు కేటాయించిన వసతిగృహాల్లోనే వార్డెన్లు ఉండి, విద్యార్థుల మంచి చెడులను పర్యవేక్షించడంతో వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొంటుండాలని అన్నారు. వసతిగృహాల్లో ఉండేవారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలని వారికి సేవ చేసే విధంగా వార్డెన్లు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే వారిని అన్నివిధాలా ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోరారు.