నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి
Published Wednesday, 3 August 2016నరసన్నపేట, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బగ్గురమణ మూర్తి అన్నారు.
స్థానిక కల్యాణ మండపంలో మంగళవారం పంచాయతీ మూడేళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసన్నపేట మేజర్ పంచాయతీని తాను దత్తత తీసుకున్నానని, దీని అభివృద్ధికి ఇప్పటికే అన్ని విధాల కృషి చేస్తున్నానని వివరించారు. ప్రతీ వీధిలో సిమెంట్ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని, మరిన్ని రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. భూగర్భ, మురికి కాలువల నిర్మాణాలను ఇప్పటికే ప్రభుత్వం ద్వారా రూ.7కోట్ల నిధులను అందించినట్టు తెలిపారు.
వాటి పనులు కూడా త్వరలోనే ప్రారంభవౌతాయని తెలిపారు. అనంతరం పంచాయతీ సర్పంచ్, పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి అధ్యక్షుడు బి.్భస్కరరావు, సర్పంచ్ చిట్టిబాబు, ఎంపిటీసీలు, వార్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.