కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు
Published Wednesday, 3 August 2016జగదాంబ, ఆగస్టు 2: పాత నగరం బురుజుపేటలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 3 నుంచి శ్రావణమాస పూజలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇఓ ఎస్జి మాధవి తెలిపారు. నెల రోజులపాటు జరిగే ఈ శ్రావణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తామని, దీనిలో భాగంగానే లక్ష్మి సహస్రనామాలు, లక్ష్మి హోమాన్ని నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా గురు, శుక్రవారాల్లో ఈ పూజలను రెండు విడతలుగా నిర్వహిస్తామన్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు దేవాలయం నిర్దేశించిన రేటు ప్రకాం అన్ని రకాల పూజా సామాగ్రిని భక్తులకు అందజేస్తామన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగానే మంగళవారం ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాన్ని, ఆయల ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు. దివ్యాలంకరణలో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.