ప్రజలను మోసగించడమే
Published Wednesday, 3 August 2016హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయటం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని ఎపిసిసి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎస్. శైలజానాథ్ అన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రకటనపై డాక్టర్ శైలజానాథ్ మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జైట్లీ ప్రకటనను నిరసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ బంద్కు ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు ఇచ్చిన బంద్ విజయవంతమైందని ఆయన తెలిపారు. బిజెపి-టిడిపిలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకూ తాము పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా తప్ప ప్యాకేజీలకు తాము అంగీకరించమని ఆయన చెప్పారు. ప్యాకేజీలతో రాష్ట్రానికి న్యాయం జరగదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు సూర్యా నాయక్ కూడా పాల్గొన్నారు.