ఎత్తిపోతల పథకాల కరెంటుపై పక్కాగా లెక్కలు
Published Wednesday, 3 August 2016హైదరాబాద్, ఆగస్టు 2: సాగునీటి ఎత్తి పోతల పథకాలతో విద్యుత్ వాడకంపై తప్పని సరిగా ఆడిటింగ్ జరగాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఇండియాకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఎనర్జీ ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి నిర్ణయించారు. లిఫ్ట్ పథకాల విద్యుత్ వాడకం,బిల్లుల వ్యవహారాన్ని సమీక్షించి నివేదిక సమర్పించేందుకు టిఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవిని నోడల్ అధికారిగా నియమించారు. హైదరాబాద్ నగర వాసులకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాల సరఫరాకు గాను తమ శాఖకు 400 కోట్లకు పైగా మొండి కరెంటు బకాయిలను చెల్లించాలని హైదరాబాద్ వాటర్ వర్క్స్ విభాగాన్ని ఇరిగేషన్ శాఖ కోరింది. సాగునీటి ఎత్తి పోతల పథకాల కరెంటు వినియోగం, బిల్లులు, ఇతర అంశాలపై మంగళవారం నాడు జల సౌధలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కె జోషి, ఇఎన్సిలు మురళీధర్రావు, విజయప్రకాశ్, టిఎస్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి శ్రీదేవి,లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఓఎస్డి శ్రీ్ధర్రావు దేశ్ పాండే, ఆస్కి ప్రతినిధి రాజ్కుమార్, ట్రాన్స్కో సిఇ ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా విద్యుత్ను వాడుకోవడం, దానిని ఆడిట్ జరిపే విధానాలపై చర్చించారు. ఇరిగేషన్ విద్యుత్ శాఖలు ప్రభుత్వానివే అయినా కొన్ని సందర్భాల్లో సకాలంలో బిల్లు చెల్లించక పోతే పెనాల్టీల రూపంలో ఇరిగేషన్ శాఖ భారీగా చెల్లించవలసి వస్తున్నదని అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో పంపులు నడవకపోయినా నాన్ రన్నింగ్ పిరియడ్ లొనూ డిస్కమ్లు భారీగా వడ్డిస్తున్నన్నారని చర్చకు వచ్చింది. దేవాదుల, అలీ సాగర్, గుత్ప తదితర ఎత్తి పోతల పథకాలు ఇప్పటికే పూర్తయిన ఎత్తి పోతల పథకాలకు విద్యుత్ వినియోగం, బిల్లుల చెల్లింపులపై సమీక్ష జరిగింది. నిర్మాణం పూర్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషనల్ అండ్ మెయిన్ టెన్స్కు సంబంధించి ఎలక్ట్రిక, మెకానికల్ ఇంజనీర్లతో ఒక ప్రత్యేక యూనిట్ను నెలకొల్పే ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఎనర్జీ వినియోగం, ఇతర అంశాలపై సమీక్షించినివేదిక ఇవ్వనున్న ఐడిసిఎం డి శ్రీదేవికి విద్యుత్ శాఖ డిఇఇని అసిస్టెంట్గా నియమించేందుకు నిర్ణయించారు.