హైస్పీడ్ రైలు ఆలస్యం
Published Wednesday, 3 August 2016ముంబయి, ఆగస్టు 2: ఢిల్లీ-ముంబయి మధ్య ట్రయల్ రన్ జరుపుతున్న టాల్గో హైస్పీడ్ రైలు మంగళవారం ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. చివరి ట్రయల్ రన్లో భాగంగా సోమవారం రాత్రి 7.55కు ఢిల్లీలో బయలుదేరిన ఈ టాల్గో రైలు మంగళవారం ఉదయం 11.40కు ముంబయి చేరుకుంది. ఢిల్లీ - ముంబయి మధ్యనున్న 1,384 కి.మీ దూరాన్ని 12 గం. 35 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా, మంగళవారం ఉ.8.31కు చేరుకున్నట్లు పశ్చిమ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, గంటకు 130 కి.మీ వేగాన్ని టాల్గో రైలు అధిగమించిందని తెలిపారు. టాల్గో హైస్పీడ్ రైలు సగటు వేగం గంటలకు 90 - 100 కి.మీ కాగా, గరిష్ఠ వేగం 130 నుంచి 150 కి.మీ. బరువు తక్కువ కలిగిన ఈ హైస్పీడ్ టాల్గో రైలు ఢిల్లీ - ముంబయి మధ్య ప్రయాణాన్ని నాలుగు గంటల వరకు తగ్గిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ తదితర సూపర్ఫాస్ట్ రైళ్లకు 16 గంటల సమయం పడుతుండగా, టాల్గో రైలు 12 గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది.