జుందాల్కు జీవిత ఖైదు
Published Wednesday, 3 August 2016ముంబయి, ఆగస్టు 2: ముంబయి ఉగ్రవాద దాడుల (26/11) ఘటనలో కీలక సూత్రధారి, నిషేధిత లష్కర్-ఈ-తోయిబా సభ్యుడు సరుూద్ జాబుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్ సహా ఏడుగురికి ముంబయి మోకా కోర్టు జీవిత ఖైదు విధించింది. 2006నాటి ఔరంగాబాద్కు అక్రమంగా ఆయుధాల తరలింపు కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు, మంగళవారం అన్సారీ సహా మహ్మద్ అమీర్, షేక్ బిలాల్ అహ్మద్, సరుూద్ అకిఫ్, అఫ్రోజ్ఖాన్, మహ్మద్ అస్లామ్ కష్మిరీ, ఫైజల్ అతుర్ రెహ్మాన్ (జూలై 11, 2006 ముంబయి రైలులో పేలుళ్ల కేసులో నిందితుడు)లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది. నిందితులు చనిపోయేవరకూ జైలు జీవితాన్ని అనుభవించాలంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీకాంత్ అనేఖర్ తీర్పులో పేర్కొన్నారు. ఇదే కేసులో మహ్మద్ ముజఫర్ తన్వీర్, డాక్టర్ మహ్మద్ షరీఫ్లకు 14 ఏళ్ల జైలు, ముస్తాక్ అహ్మద్, జావేద్ అహ్మద్, అఫ్జల్ ఖాన్లకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 2006 మే 8న టాటా సుమో, ఇండికా కారులో అక్రమంగా ఆయుధాలు, పేలుళ్ల సామగ్రి తరలిస్తూ ఔరంగాబాద్కు సమీపంలోని చాంద్వాడ్-మన్మాడ్ హైవేపై మహారాష్ట్ర ఏటిఎస్ బృందాలకు నిందితులు దొరికిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో 30 కేజీల ఆర్డీఎక్స్, పది ఏకె 47 రైఫిల్స్, 3.2వేల బుల్లెట్లు సహా భారీగా పేలుడు సామగ్రి, పరికరాలను ఏటిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా 22మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. అయితే, కేసును విచారించిన ప్రత్యేక కోర్టు, సరైన ఆధారాలు లేని కారణంగా ఎనిమిది మందిని గతంలోనే మోకా చట్టం నుంచి తప్పించింది. నేరాంగీకారంతో ఒకరు అప్రూవర్గా మారడం, మరొకరు అదృశ్యం కావడంతో కేసునుంచి ఆ ఇద్దరినీ పక్కనపెట్టారు. మిగిలిన 12మంది నిందితులను విచారించిన కోర్టు దోషులుగా నిర్థారిస్తూ మంగళవారం శిక్షలు విధించింది. జిహాద్ నినాదంతో నిందితులంతా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుండటం, స్థానికులను చేరదీసి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడమేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, విహెచ్పి నేత ప్రవీణ్ తొగాడియాను అంతమొందించేందుకు కుట్ర పన్నారన్న ప్రాసిక్యూషన్ వాదనతో అంగీకరించిన మోకా కోర్టు, ఈ మేరకు శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది.
ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసిన నిందితులు అబు జుందాల్ తదితరులు (ఫైల్ ఫొటో)