జాప్యంతో ఇంకా నష్టమే
Published Thursday, 4 August 2016విభజన చట్టం ఆమోదం పొందే సమయంలో పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండేళ్లపాటు కాలయాపన చేయడంవల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. తొలుతే అమల్లోకి వచ్చి ఉన్నట్లయితే ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ప్రయాణం చేసి వుండేవాళ్లం. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ఆంధ్రప్రదేశ్ పక్షాన ప్రత్యేక హోదా కావాలంటూ మాట్లాడిన ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు మాటమార్చి అసలు ప్రత్యేక హోదా ప్రస్తావన బిల్లులో లేనందున సాధ్యపడదనీ, అసలు ఆర్థిక ప్రయోజనమేమీ వుండదనీ అంటున్నారు. అంతకంటే ఎక్కువగా సహాయపడుతూ న్యాయం చేస్తున్నామనటం కూడా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. రెండేళ్లు గడచిన తర్వాత అయినా ఇప్పుడు అధికారపక్ష తెలుగుదేశం కూడా ఇతర పక్షాలతో కలిసిరావటం శుభ పరిణామం. అందుకే ప్రత్యేక హోదాను సాధించేందుకు ఇది తగిన సమయం. ఇక అటోఇటో ఏదోఒకటి తేలాల్సి వుంది. ఇప్పుడు పరిష్కారం కాకపోతే ఇక ఎప్పటికీ న్యాయం జరగదు. అన్ని పక్షాల ఎంపీలు ఒక్కతాటిపై నిలిచి ప్రధాని నరేంద్ర మోదీతో అనుకూల ప్రకటన చేయించాలి. అలాగే జరగబోయే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గంలో ఇక ఒక్కక్షణం కూడా కొనసాగటానికి వీల్లేదు. వెంకయ్యలో నైతిక విలువలు ఏమైనా ఉంటే తక్షణం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఆంధ్రుల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎన్నికల్లో హోదాపై ప్రచారం చేసిన పవన్కళ్యాణ్ కూడా నోరువిప్పాలి.