రాజ్నాథ్కు ఉగ్ర సెగ
Published Thursday, 4 August 2016ఇస్లామాబాద్, ఆగస్టు 3:‘గో బ్యాక్..గో బ్యాక్..అంటూ ఉగ్రవాద సంస్థలు తీవ్ర స్ధాయి నిరసనలు, ప్రదర్శనల మధ్య భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఇస్లామాబాద్ అడుగు పెట్టారు. ఉగ్రవాద సంస్థలు, వాటి మద్దతుదారులు వీధుల్లో పడి నిరసనలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నప్పటికీ వారిని నిరోధించే ప్రయత్నాలేవీ జరుగలేదు. ముఖ్యంగా అత్యంత సునిశితమైన రాజ్నాథ్ పర్యటన ప్రాధాన్యతను కూడా పట్టనట్టే వ్యవహరించింది. సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత హోం మంత్రి పర్యటనను వ్యతిరేకించాలని జమాద్ ఉద్ దవా మిలిటెంట్ సంస్థ అధినేత హఫీజ్ సరుూద్ పిలుపునిచ్చినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బాహటంగానే ఉగ్రవాద సంస్థలు ప్రదర్శనలు జరుపుతున్నా వాటిని నిరోధించేందుకు నవాజ్ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్న అంశం కొట్టొచ్చినట్టు కనిపించింది. విమానాశ్రయం నుంచి హోటల్కు రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి రాజ్నాథ్ను హెలికాప్టర్ ద్వారానే అక్కడికి తీసుకెళ్లారు. రాజ్నాథ్ బస చేసిన హోటల్కు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ ఉన్నట్టుగా కూడా కథనాలు వెలువడ్డాయి. మరో పక్క రాజ్నాథ్ అడుగు పెట్టిన రోజునే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా కాశ్మీర్ అంశాన్ని మరింతగా రెచ్చగొట్టారు. ఈ అంశం భారత్ అంతర్భాగం కాదని దౌత్యవేత్తల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని ప్రపంచ దేశాలకు వివరించాలన్నారు. ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్నది సరికొత్త స్వాతంత్రోద్యమమని వ్యాఖ్యానించడం ద్వారా రాజ్నాథ్ పర్యటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మరింత ఆజ్యం పోశారు. కాగా, గురువారం జరుగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాక్ ఉగ్ర ధోరణిని ఎండగట్టే విధంగా రాజ్నాథ్ సింగ్ చాలా ఘాటుగానే మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. భారత్లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతు నిలిపివేయాలని, అలాగే, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల్ని కట్టడి చేయాలని ఈ సందర్భంగా పాక్ను గట్టిగా కోరే అవకాశం ఉంది. అలాగే పాక్ ప్రోద్బలంతో ముద్రితమవుతున్న భారత నకిలీ కరెన్సీ నోట్ల అంశాన్ని కూడా రాజ్నాథ్ ప్రస్తావించవచ్చునని చెబుతున్నారు.
చిత్రం... పాక్లో వెల్లువెత్తిన మిలిటెంట్ సంస్థల నిరసనలు
ఇస్లామాబాద్లో రాజ్నాథ్కు స్వాగతం