హోదా కోసం వినూత్న నిరసన
Published Thursday, 4 August 2016విజయవాడ, ఆగస్టు 3: ప్రత్యేక హోదాకై సిఎం, కేంద్ర మంత్రుల నివాస గృహాల ఎదుట రోడ్లు ఊడ్చాలంటూ పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నందిగామ సమీపంలోని పొన్నవరంలోని కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాస గృహం ఎదుట రోడ్లను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చీపుర్లు చేతబట్టి ఊడ్చారు. గ్రామస్థులంతా తరలివచ్చి ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అయితే తెదే కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిఎం క్యాంప్ కార్యాలయం ఎదుట రోడ్లను ఊడ్చేందుకుకై చీపుర్లు చేతబట్టుకుని ఆంధ్రరత్న భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు ఏలూరు రోడ్డులో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పిసిసి ప్రధాన కార్యదర్శులు మీసాల రాజేశ్వరరావు, నరహరశెట్టి నరసింహరావులతో పాటు మొత్తం 20 మందిని అరెస్టు చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరిగి సాయంత్రం విడుదల చేశారు.
హోదా కోసం రోడ్లు ఊడుస్తున్న కాంగ్రెస్ నాయకులు