కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి
Published Thursday, 4 August 2016కడెం, ఆగస్టు 3: ఆదిలాబాద్ జిల్లాలో అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్లో ఇన్ఫ్లో వరదనీరు వేలాది క్యూసెక్కులుగా వచ్చి చేరుతుండడంతో కడెం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, బుధవారం నాటికి 697.500 అడుగుల వరకు నీటిమట్టం ఉండగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 43 వేల ఇన్ఫ్లో వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై కడెం ప్రాజెక్టుకు చెందిన 6,7,8,11వ నంబరుగల వరద గేట్లను పది ఫీట్ల వరకు ఎత్తులేపి దాదాపు 44 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు ప్రధానకాలువ అయిన ఎడమ కాలువకు 670 క్యూసెక్కులు, కుడి కాలువకు 25 క్యూసెక్కుల నీటిని పై కాలువల ద్వారా సరఫరా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు జలాశయంలో వరదనీరు వచ్చిచేరుతుండడంతో మరోపక్క నీటిమట్టం పెరుగుతుండడంతో కడెం ప్రాజెక్టుకు చెందిన నీటిపారుదలశాఖ ఈఈ వెంకటేశ్వర్రావు, డిఈ నూరొద్దిన్, ఎఈ శ్రీనాథ్, కడెం ప్రాజెక్టు వద్దనే తమ సిబ్బందితో మకాంవేసి ఉండి నీటిమట్టం పెరుగుదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ సమాచారాన్ని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వారి సలహాలు, సూచనలను పాటిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 697.500 అడుగులకు మెయంటెనెన్స్ చేస్తున్నామని, 26 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వరదనీరు వచ్చి చేరుతుందని, ఇన్ఫ్లో వరదనీరు మరింత పెరిగితే మరొక గేటు ఎత్తివేసి గోదావరిలోకి నీటిని వదలడం జరుగుతుందని డిఈ నూరొద్దిన్ విలేకర్లకు తెలిపారు. జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండడం, మరోపక్క వరదగేట్లు ఎత్తివేస్తూ గోదావరిలోకి నీటిని వదులుతుండడంతో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని గోదావరి పర్యాటక ప్రాంతాల్లోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
కడెం ప్రాజెక్టు వరదగేట్లు ఎత్తివేయడంతో గోదావరిలోకి
పరవళ్లు తొక్కుతున్న నీరు