ప్రభుత్వ విద్యావిధానం మహోన్నతమైనది
Published Thursday, 4 August 2016మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 4: ప్రభుత్వం ఆమలు చేస్తున్న విద్యావిధానం ఎంతో మహోన్నతమైనదని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారిని సంస్కరవంతులుగా చేయాలని ప్రభుత్వం ఉచిత నిర్భంద విద్యాను అందిస్తుందన్నారు. ప్రభుత్వం కోట్లాది రుపాయలు ఖర్చు చేసి ఆమలు చేస్తున్న విద్యావిధానం అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసి ఆర్ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెస్తున్నారన్నారు. ప్రభుత్వం కెజి టు పిజి వరకు అందరికి ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఆమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఏ ఇతర రాష్ట్రాల్లో లేవని ఆయన అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన వౌలిక సదుపాయలు కల్పించి ఇతర రంగాల్లో కంటే ప్రభుత్వ రంగంలోనే విద్యాను అభ్యసించాలనే అభిరుచిని ప్రజల్లో కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సదుపాయలను కల్పించడం జరుగుతుందని అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఉపాధ్యాయులు కూడా తమ విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాలని అప్పుడే విద్యార్థులకు ఉపాధ్యాయులపై గౌరవం పెరుగుతుందని అలాగే సమాజం గర్వించదగ్గ భావిభారత పౌరులుగా ఎదుగుతారని ఆయన పెర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐఓ విజయలక్ష్మీ, టిఆర్ఎస్ నేతలు రాజేశ్వర్గౌడ్, వెంకటయ్య, ఉపాద్యాయులు పాల్గొన్నారు.