మరోసారి భంగపాటు
Published Friday, 5 August 2016ముంబయి, ఆగస్టు 4: మళ్లీ అదే జరిగింది. మాల్యా ఆస్తుల వేలానికి దిగిన బ్యాంకర్లకు మరోసారి భంగపాటు తప్పలేదు. ధర తగ్గించినప్పటికీ కింగ్ఫిషర్ హౌస్ను కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు మరి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పేరిట బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని చెల్లించలేక మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే. ఈ క్రమంలో బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధమవగా, మార్చిలో 150 కోట్ల రూపాయలకు వేలం వేసిన కింగ్ఫిషర్ హౌస్ను గురువారం 135 కోట్ల రూపాయలకే వేలానికి పెట్టారు. అయినా స్పందన శూన్యం. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు మాల్యా సారథ్యంలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడింది. కాగా, 17 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నిర్మించిన కింగ్ఫిషర్ హౌస్.. ముంబయిలోని విలే పార్లే ప్రాంతంలో ఉంది. ఉదయం 11 గంటలకు దీని వేలం మొదలవగా, నిర్ణీత గడువులోగా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇకపోతే ఈ నెలలో మొత్తం 700 కోట్ల రూపాయలకుపైగా విలువైన మాల్యా ఆస్తులను బ్యాం కులు వేలం వేస్తుండగా, ఈ నెల 18న సేవా పన్ను శాఖ మాల్యా వ్యక్తిగత విమానాన్ని వేలం వేయనుంది. 25న మాల్యాకు చెందిన ఎనిమిది కార్లను వేలం వేస్తుండగా, కింగ్ఫిషర్ లోగో, ట్రేడ్ మార్కులను అమ్మకానికి పెట్టనున్నారు. గోవాలోని కింగ్ఫిషర్ విల్లాను కూడా బ్యాంకర్లు వేలం వేస్తున్నారు. దీని విలువ దాదాపు 90 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. మొత్తానికి కింగ్ఫిషర్ నుంచి ఏ రకంగానూ బ్యాంకర్లు పైసా కూడా వసూలు చేయలేకపోతుండటం గమనార్హం. ఇప్పటికే మాల్యా వ్యవహారం పై బ్యాంకులు న్యాయస్థానాలనూ ఆశ్రయించగా, లండన్ నుంచి మా ల్యాను రప్పించడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు.