కాళేశ్వరం, మల్లన్న సాగర్ సమస్యలపై వివరిస్తాం..సమయమివ్వండి
Published Friday, 5 August 2016న్యూఢిల్లీ,ఆగస్టు 4: కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితుల సమస్యలు వివరించేందుకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది పథకాలను ప్రారంభించేందకు నరేంద్ర మోదీ తెలంగాణకు వెళుతున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం, మల్లన్న సాగర్ బాధిత రైతులు, ప్రజల సమస్యలు వివరించేందుకు గజ్వేల్ పర్యటన సందర్భంగా తమకు సమయం కేటాయించాలని లక్ష్మయ్య ప్రధానిని కోరారు. ముఖ్యమంత్రి నియతృత్వ ఆదేశాల మూలంగా పోలీసులు స్థానిక గ్రామాలను చక్రబంధంలో పెట్టారని, బాధిత రైతులు, ప్రజలను బైటికి రానివ్వటం లేదని ఆయన తమ లేఖలో ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని రీడిజైన్ పేరుతో పూర్తిగా మార్చివేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చివేశారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అర్థం పర్థం లేని ప్రాజెక్టు అని లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల అమలులో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయటం లేదని ఆయన ఆరోపించారు. గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల హక్కులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలని లక్ష్మయ్య ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.