6న టిడిపి మహాధర్నా
Published Friday, 5 August 2016ఖైరతాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 6న నగర టిడిపి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్టు టిఎన్ టియుసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి తెలిపారు. గురువారం ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతుందని అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ నుంచి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వరకు అన్నింటిని కెసిఆర్ విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్రంలో కంటే దారుణంగా అణిచివేతలు కొనసాగడం ప్రజలకు కన్నీరు తెప్పిస్తుందని, ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు సైతం తెలుపుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తమది బలమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న పాలకులు.. ప్రజల బాధలను సైతం వినక పోవడంతో ఆవేదనకు గురై ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే ఈనెల 6న నిరసన కార్యక్రమాలకు సిద్ధమైనట్టు చెప్పారు.
గ్రేటర్ ఇన్చార్జి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో 6న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు మహ్మద్ మహబూబ్, మజహర్ నవాబ్, అనిల్కుమార్, మహేష్ యాదవ్, యర్రవరపు రమణ, ఆకుల వెంకటేష్, బాలాజీ గోస్వామి జ్ఞానేశ్వర్ యాదవ్, రాజశేఖర్ పాల్గొన్నారు.