ఒత్తిడి తెస్తా.. పరిహారం ఇప్పిస్తా...
Published Friday, 5 August 2016మిర్యాలగూడ, ఆగస్టు 4: తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి టేల్పాండ్ భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తానని సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి అన్నారు. టేల్పాండ్ భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం పునరావాసం కల్పించాలని కోరుతూ భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గురువారం మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టేల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణం వలన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుందని, అందువల్ల టేల్పాండ్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేంతవరకు వారి పక్షాన ఉండి ఉద్యమిస్తానని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి టేల్పాండ్ భూనిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన అన్నారు. టేల్పాండ్ భూనిర్వాసితులు చేస్తున్న పోరాటాలకు సహకారం, మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారిపక్షాన ఉండి పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. అసైన్డ్, కాందీశీకుల భూములపై అసైన్డ్ పట్టాలు పొందిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు. టేల్పాండ్ నిర్మాణం వలన ఎనిమిది ఎత్తిపోతల పథకాలు ముంపునకు గురవుతున్నందున ఆ లిఫ్టులను పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను రెండు తెలుగు రాష్ట్రాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.