కొనసాగుతున్న పుణ్య స్నానాలు
Published Friday, 5 August 2016మంగపేట, ఆగస్టు 4: వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్ వద్ద అంత్య పుష్కరాలలో ఐదవ రోజైన గురువారం అనేక మంది భక్తులు, సందర్శకులు పుష్కర స్నానాలు ఆచరించారు. జిల్లా కేంద్రంతో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి పుష్కర స్నానాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. మంగపేట పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం మండల కేంద్రంలోని శివాలయంకు వెళ్ళి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర స్నానాలకు ఇతర ప్రాంతాల నుండి మంగపేట పుష్కరఘాట్కు వచ్చిన అనేక మంది రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి (మల్లూరు గుట్ట) ఆలయంను దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరికొంత మంది సందర్శకులు సమీపంలోని ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో ప్రసిద్ధి చెందిన బొగత జలపాతంను సందర్శించడం కోసం తరలివెళ్తున్నారు. అంత్య పుష్కరాలకు వచ్చే మహిళా భక్తుల కోసం పుష్కరఘాట్ వద్ద కనీసం బట్టలు మార్చుకునే గది ఏర్పాటు చేయకపోవడంపై మహిళా భక్తులు అధికారుల తీరును విమర్శిస్తున్నారు.