మేం అధికార పక్షమా.. ప్రతిపక్షమా?
Published Friday, 5 August 2016తుళ్లూరు, ఆగస్టు 4: పార్టీ జెండా మోసిన తాము ప్రతిపక్షమా, అధికారపక్షమా చెప్పమంటూ తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎదుట గళమెత్తారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక గంటలమ్మ చెరువుకట్టపై చినరాజప్ప మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు కార్యకర్తలు రెవెన్యూ, పోలీసు అధికారులు తమమాట వినడం లేదంటూ నిరసన వ్యక్తంచేశారు. పార్టీ విజయానికి కృషిచేసిన తమను కాదని వలసవచ్చిన ఇతర పార్టీల నాయకులకు కొమ్ము కాస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు. దీనిపై చినరాజప్ప స్పందిస్తూ అట్టడుగుస్థాయి నుండి కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. వర్గ రాజకీయాలను విడనాడి సమన్వయంగా ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి కార్యకర్తా ఉత్తేజభరితంగా పనిచేయాలని కోరారు. శుక్రవారం గుంటూరులో ఉంటానని, సమస్యలు ఉన్న కార్యకర్తలు తన వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేస్తూ ఇతర పార్టీల నుండి నాయకులు, ఓటర్లను ఆకర్షించడంలో కీలక బాధ్యత వహించాలన్నారు. రాజధాని ఈ ప్రాంతానికి రావడం అదృష్టమని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావు, ఎంపిపి వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, సీనియర్ నాయకులు దామినేని శ్రీనివాసరావు, అనుమోలు సత్యనారాయణ, బెల్లంకొండ నరసింహారావు, అప్పారావు, ఎ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
*