ప్రధాని సభకు స్వచ్ఛందంగా తరలిరావాలి
Published Friday, 5 August 2016చిన్నశంకరంపేట, ఆగస్టు 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల తరువాత అమె విలేఖరులతో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు రానున్న ప్రధాని బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగాపాల్గొని రాష్ట్ర ప్రతిష్టతను కాపాడాలన్నారు. ప్రధాని హోదాలో మొదటిసారి రాష్ట్రంతో పాటు మెదక్ జిల్లాకు రావడం శుభ సూచకమన్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి 40 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడం జరుగుతుందని, దీని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలుకుదామన్నారు. తెరాస శ్రేణులు క్రమశిక్షణతో ప్రజలను తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మీ, ఎంపిడిఓ బాల, విద్యాధికారి బాలచంద్రం, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, సర్పంచ్లు మైనంపల్లి రంగరావు, కుమార్గౌడ్, సిద్దాగౌడ్, ఎయంసీ చైర్మన్ నరేందర్, లక్ష్మారెడ్డి, సిద్దిరాములు, రాజుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.