అల్వాల్లో హై అలర్ట్
Published Sunday, 25 September 2016అల్వాల్, సెప్టెంబర్ 24: అల్వాల్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉన్న చెరువులు అన్ని నిండుకుండలా మారి మిగిలిన నీరు మత్తడి ద్వారా పొంగిపొర్లడంతో ఏకధాటిగా వరద నీరు ప్రవహించి కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. వరద బాధితులకు పరామర్శల పర్వం కొనసాగుతోంది. బాధితులకు దాతలు ఎవరికి తోచిన విదంగా వారు సహకారం అందిస్తున్నారు. పాలు, పండ్లు, దుస్తులు పంపిణీతోపాటు అన్నదానం, నీటి సరఫరా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే నిజంగా కాలనీలో జలమయమైన వారిని ఎవరూ పట్టించుకోవటంలేదు. మరోవైపు వారు కూడా మొహమాటంతో అన్నదానంలో భోజనం చేయటానికి ముందుకు రావటం లేదు. కానీ వాస్తవానికి వారు భోజనం లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా ఎవరూ అందులో ఉండటంలేదు . కంటోనె్మంట్లోని బొల్లారం, అల్వాల్ మున్సిపాలిటీలోని తుర్కపల్లి నుండి వస్తున్న వరద నీటికి ఉన్న చెరువులు అన్నీ నిండి నిరంతరం నీరు వస్తోంది. 15 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చిన వరదలు తిరిగి ప్రస్తుతం వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు ఇన్ని కాలనీలు లేవని ఖాళీస్థలాలు ఉండంతో వరద ఉద్ధృతి తక్కువగా ఉందని, కానీ ప్రస్తుతం వరదనీరు ఇంకడానికి ఖాళీ స్థలాలు లేని కారణంగా కాలనీలు అన్ని జలమయమయ్యాయని చెబుతున్నారు. ప్రమాదాన్ని తగ్గించటంకోసం అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా గంటగంటకు వర్షం కురవటంతో వరద పెరుగుతోంది. ఎలాంటి ముప్పువాటిల్లినా తక్షణమే సహాయ చర్యలు చేపట్టటానికి మిలటరీని ప్రభుత్వం దించింది.
మిలటరీ సిబ్బంది మున్సిపల్ డిప్యూటీ కమిషనరు అడప రమేష్ జోనల్ కమిషనర్ శంకరయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, బ్రిగేడియర్ రాజీవ్ త్రివేది, కార్పొరెటర్లతో సమావేశమై ఎక్కడెక్కడ ప్రమాద పరిస్థితులు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న చెరువుల్లో నీటి సామర్యం ఎంత ? వరద నీటి ఉద్ధృతిని తగ్గించటానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ అనే అంశాలపైన చర్చించారు. వరద ముంపు ప్రాంతాలను మిలటరీ అధికారులు సమీక్షించారు.