ప్రశ్నించే వర్గాలపైనే తూటాలు
Published Sunday, 25 September 2016మహబూబాబాద్, సెప్టెంబర్ 24: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. ప్రశ్నించే వర్గాలపై తూటాలు పేలుతూనే ఉన్నాయని సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మానుకోటలో శనివారం ఏర్పాటు చేసిన ప్రముఖ కవి రుక్మిణి రాంరెడ్డి సంతాప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ్మినేని రుక్మిణి రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతాప సభలో మాట్లాడుతూ.. రుక్మిణి రాంరెడ్డి సామాజిక అవగాహనతో తన రచనల ద్వారా మందిని కదిలించారన్నారు. ఆయన రచనలతో తాను కూడా అనేక సార్లు ప్రభావితమయ్యాయని అన్నారు. సాయుధపోరాటం నుండి నేటి తెలంగాణ సాధన పోరాటం వరకు ప్రతి విజయంలోనూ సాంస్కృతిక పోరాటాల పాత్ర అత్యంత గొప్పదన్నారు. పరిపాలించే వ్యక్తులు, పార్టీలు మారాయి తప్ప విదానాలు మారలేదని అన్నారు.