మరొకరి నిష్క్రమణ
Published Sunday, 25 September 2016కాటమరాయుడంటే మాటలా? కోపం వస్తే ఎవరికైనా కాటు తప్పన్నట్లుగా సాగుతోంది కాటమరాయుడు సినిమా పరిస్థితి. తాజాగా ఈ సినిమా యూనిట్ నుండి మరొకరికి కాటమరాయుడు దెబ్బపడిందని టాలీవుడ్ భోగట్టా. తొలుత ఈ చిత్రానికి దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారు. అనుకోకుండా తమిళంలో వచ్చిన భారీ ఆఫర్లతో ఆయన పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత కిషోర్ పార్థసాని (డాలీ) రంగంపైకి వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. పవన్కల్యాణ్ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రానికి కెమెరామెన్గా పనిచేస్తున్న సౌందర్యరాజన్ పక్కకు తప్పుకున్నారు. అనుకున్న సమయానికి సినిమా ప్రారంభం కాకపోవడంతో సౌందర్యరాజన్ పక్కకు తప్పుకున్నాడట. అతని స్థానంలో ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి కెమెరామెన్గా పనిచేసిన ప్రసాద్ మూరెళ్లను తాజాగా యూనిట్లోకి తీసుకున్నారు. ప్రసాద్, పవన్కల్యాణ్ల కాంబినేషన్లో షూటింగ్ స్పీడ్గా జరగనున్నదని యూనిట్ భావిస్తోంది. సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని మార్పులుంటాయో చూడాలి.