అంతా పూర్ణమే
Published Sunday, 25 September 2016విశ్వమంతా వ్యాపించినవాడిని ఈశ్వరుడని మనం పిలుస్తాం. ఈ ఈశ్వరుడే పరమేశ్వరునిగా కీర్తిస్తాం. ఈ పరమేశుడు అందరికి దగ్గరగా ఉంటాడు. దూరంగాను ఉంటాడు. అందరిలోను ఉంటాడు. అందరిలో చైతన్యరూపుడై వెలిగేవాడే ఈశ్వరుడు. భక్తికి వశమయ్యే భగవానుడుగా కీర్తినొందినవాడు. అన్నింటికి కర్త ఒక్కడే అన్న జ్ఞానాన్ని కలిగినవాడు మనిషి. నిష్కామభావంతో కర్మలను చేయమంటుంథి ఈశావాస్యోపనిషత్తు. కర్మలే అంటకుండా ఉండే మనిషి వందసంవత్సరాలు బతుకుతాడు. సదా భగవంతుని నామానే్న జపిస్తూ ఉంటాడు. విషయవాసనలేవీ దగ్గరకు రాకుండా విషయాలను భగవంతునికి అర్పించే మనిషే దివ్యుడు. సర్వత్రావ్యాపించి ఉన్న భగవంతుడు నానారూపాల్లో కనిపిస్తున్నాడు. ఏ కనిపించే వస్తువైనా అవస్తువైనా భావమైనా భావాతీతమైనా అది భగవంతుడే అన్న విశ్వాసంతో ఉన్న జీవి పరమాత్మస్వరూపమే. నారాయణునకు నరునకు భేదమెక్కడ కనిపిస్తుంది. ఈ జ్ఞానమున్న జ్ఞానికి సర్వమూ పరమాత్మస్వరూపంగానే భాసిస్తుంది. కనుకనే ‘‘ఓం పూర్ణమదః పూర్ణమిదం .... పూర్ణమేవావశిష్యతే’’ అనగలుగుతాడు. అంతటా పూర్ణమే ఆవరించి ఉంది. ఆ పూర్ణంలో పూర్ణముదయిస్తుంది. పూర్ణంలో పూర్ణం పోయినా పూర్ణమే మిగులుతుంది. అదే భగవంతుని స్వరూపం. జగత్తుఅంతా జగన్నాథుని నివాసమే.