సైకిల్ కోసం విరాళాలు!
Published Sunday, 25 September 2016భారత సైక్లిస్టు డెబోరా హెరాల్డ్ మృత్యుంజయురాలిగా చాలా మందికి తెలుసు. 2004లో ముంచెత్తిన సునామీలో చిక్కుకొని, సుమారు వారం రోజులు ఒక చెట్టును ఆధారంగా చేసుకొని ఆమె బతికిబట్టకట్టింది. కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోగొట్టుకొని ఒంటరిగా మిలిగిన ఆమె సైక్లింగ్పై దృష్టి కేంద్రీకరించింది. ఒకప్పటి సునామీ బాధితురాలు ఇప్పుడు సైక్లింగ్ చాంపియన్గా ఎదిగింది. అయితే, మరో రెండు నెలల్లో జరిగే ట్రాక్ వరల్డ్ కప్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న ఆమె వద్ద అత్యాధునిక సైకిల్ లేదు. దాని ఖరీదు సుమారు ఏడు లక్షల రూపాయలు కావడంతో, కొనే శక్తి కూడా ఆమెకు లేదు. అందుకే ప్రజల నుంచి విరాళాలు సేకరించి, సైకిల్ కొనాలని యోచిస్తున్నది. గ్లాస్గోలో నవంబర్ మాసంలో ట్రాక్ వరల్డ్ కప్ చాంపియన్షిప్స్ జరుగుతాయని డెబొరా తెలిపింది. 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ పాల్గొంటానని చెప్పింది. ట్రాక్ వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నానని, న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన ట్రాక్ ఆసియా కప్ పోటీల్లో, రెండు వేర్వేరు విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించిన డెబొరా తెలిపింది. మలేసియా, హాంకాంగ్, ఖజకస్తాన్ తదితర దేశాల సైక్లిస్టుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్న ఆమె విజేతగా నిలవడం విశేషం. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ట్రాక్ వరల్డ్ కప్లోనూ పతకాలను గెల్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపింది. పతకంతోనే గ్లాస్గో నుంచి స్వదేశానికి రావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది.