ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు
Published Monday, 26 September 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/26s_3.jpg?itok=ZSZk7X_w)
కె.కోటపాడు, సెప్టెంబర్ 25: ‘నేరం నాదికాదు ఆకలిది’ అని ఓ సినిమాలో విన్నాం. కె.కోటపాడులో కూడా నేరం ఆకలిది అన్నట్టు ఓ పంది తన జాతిపిల్లలనే తినేస్తోంది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా, కె.కోటపాడులోని విద్యుత్శాఖ కార్యాలయం వద్ద పందుల గుంపు సంచరిస్తుంటాయి. సమీప ఇళ్ళల్లోని మహిళలు వేసిన ఆహారాన్ని తిని జీవిస్తుంటాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పందులకు ఆహారం దొరకడం లేదు. దీంతో ఓ పెద్ద పంది సమీపంలోని తన జాతిపిల్లను చంపి తినేసింది. అందరూ చూస్తుండగా రెండు, మూడు రోజులకో మారు ఈ విధంగా పంది పిల్లను చంపి తింటుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలపై దాడి చేస్తే తమ పిల్లల ప్రాణాలేంకానుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పందులను గ్రామాలకు దూరంగా పెంచుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చిత్రం.. తన జాతి పిల్లనే చంపి తింటున్న పంది