ఉద్ధృతంగా యనమదుర్రు డ్రెయన్
Published Monday, 26 September 2016భీమవరం, సెప్టెంబర్ 25: అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల యనమదుర్రు డ్రెయిన్కు జలవనరుల శాఖ అధికారులు వరద నీటిని వదిలారు. ఈ నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నందమూరు అక్విడెక్ట్ వద్ద క్రమేణా నీటి పరిమాణం పెరుగుతోంది. యండగండి, భీమవరం వరకు అదే విధమైన నీటి ప్రవాహన్ని చూపుతోంది. నీటి ప్రవాహం కారణంగా యనమదుర్రు డ్రెయిన్కు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతూ కోస్తాకు భారీ వర్షాలు కురుస్తాయని, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో ముందుగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యనమదుర్రుకు ఆనుకుని ఉన్న గ్రామాలకు విఆర్వోలు, కార్యదర్శులను పంపించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి ప్రమాదం సంభవించినా వెంటనే సమాచారం అందించాలని అధికారులు వారిని కోరారు. భీమవరం శివారులోని యనమదుర్రు గట్లను తాకుతూ వేగంగా ప్రవహిస్తోంది. పట్టణంలో ఎటువంటి వరద ఛాయలు రాకుండా మున్సిపాల్టీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. భీమవరం మండలంలోని గ్రామాలను అప్రమత్తం చేసింది. రానున్న రోజుల్లో కురిసే వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.