ప్రజలకు అత్యంత చేరువుగా బిజెపి
Published Monday, 26 September 2016అనకాపల్లి(నెహ్రూచౌక్), సెప్టెంబర్ 25:రానున్న రోజుల్లో ప్రజలకు అత్యంత చేరువైన పార్టీగా బిజెపి పుంజుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అన్నారు. స్థానిక వివేకానంద హాలులో ఆదివారం పండిట్ దీనదయాళ్ 100వ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకులు వై. సత్యారావు, తోట విజయలక్ష్మి మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆదర్శంతోనే భారతీయ జనతాపార్టీ ప్రజలకు అనేక సేవలను అందిస్తుందని, ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టార న్నారు. 2019నాటికి ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రణాళిక ప్రకారం నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు సత్యారావు మాట్లాడుతూ ప్రతిపేదవాడు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా పండిట్ దీనదయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మళ్ల వెంకట్రావు, డాక్టర్ సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ ఎంఎం నాయుడు, హిమశేఖర్ కరస్పాండెంట్ జనార్దన్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డాది వరలక్ష్మి, జనరల్ సెక్రటరీ కొణతాల రాజాబాబు, గొంతిన భక్తసాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.