దుర్గమ్మకు స్వర్ణమయి కానుకలు
Published Monday, 26 September 2016విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 25: ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవతగా ఉన్న శ్రీకనకదుర్గమ్మ అనుగ్రహం కోసం విశాఖపట్నానికి చెందిన ఒక భక్తుడు స్వర్ణమయి ఆభరణాలు సమర్పించారు. అమ్మవారి అంతరాలయం, ప్రధాన ద్వారానికి ఉన్న తలుపులకు ఇరువైపుల, గోడలు తదితర వాటిని పూర్తిగా స్వర్ణమయం చేశారు. లోపల గోడలకు ఇరువైపుల సరస్వతీ, లక్ష్మీ చిత్రాలు, అంతరాలయం ద్వారం పైభాగంలో ఉన్న గజలక్ష్మీదేవి తదితర దేవతమూర్తుల చిత్రాలకు స్వర్ణమయి తాపడం చేయించారు. ఇదేవిధంగా ప్రధాన ద్వారం తలుపులకు కూడా బంగారు తాపడం పనులు పూర్తి చేశారు. ఉత్సవ విగ్రహాలలోని స్ర్తిమూర్తులిరువురికి రెండు బంగారు వడ్డాణాలు, మూల విరాట్లకు బంగారు పతకాల హారాలు, దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అలకరించేందుకు పట్టు వస్త్రాలు అందజేశారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఆదివారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాటిని పరిశీలించి ఇవో ఎ సూర్యకుమారికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శంకర శౌండిల్య, సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు పాల్గొన్నారు.
చిత్రం.. దుర్గమ్మ ఆలయ తలుపులు, గోడలకు బంగారు తాపడం చేయించిన దృశ్యం